Tuesday, October 16, 2018

కాశీ క్షేత్ర వైభవం

Oct 15

"కాశీ క్షేత్ర వైభవాన్ని  " వర్ణించుటకు ఎవరి   తరము  కాదు ? "కాశీ " అంటే ప్రకాశించునది.   అని అర్థము ,అది పరమాత్మ స్వయంప్రకాశదివ్య క్షేత్రం !సృష్టి మొత్తం ప్రళయం లో లయం అయినా కూడా , ఈ" కాశీక్షేత్రం "మాత్రం దేదీప్యమానంగా శాశ్వతంగా ,అఖండంగా ,అపర కైలాసవైభవ నిలయంగా , భక్తకోటి కల్పవల్లిగా , ,ఆర్తుల పాలిట కామధేనువు గా వర్ధిల్లుతూ  నిలుస్తుంది  ! ఎందుకంటే ,సృష్టికి పూర్వము నుండీ ,  ఈ "కాశీ క్షేత్రం "సాక్షాత్తూ గౌరీ శంకరుల నివాసస్థానం కాబట్టి !  సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ లకు నిలయం ఈ క్షేత్రం   !     "సత్యం  "అంటే శాశ్వతం, !",శివమ్" అంటే  జ్ఞానం ,!" సుందరం" అంటే ఆనంతమైన ఆనందం ! అదే పరమానందం..! జగతిలో మనం చూసే  పదార్థాలు ,వినే పదాలకు వ్యతిరేక  విపరీత పదాలు  ఉంటాయేమో కానీ ,  "ఆనందం !"  అనే ఒకే ఒక్క పదానికి వ్యతిరేక పదం ఉండదు ,!ఉండబోదు..! ఎందుకంటే అది  "పరమాత్ముని సచ్చిదానంద ఘన స్వరూపం..!" శాస్త్రజ్ఞానం ,కాశీ క్షేత్ర మహాత్మ్యం తెలిసినవారికి ,,కాశీలో అడుగడదుగునా ఆనందం లభిస్తుంది.!. ఒకసారి , రెండు ఈగలు  ,ఎక్కడో కాశీ క్షేత్ర ప్రభావం విని కాశీకి వెళ్లాలని ,,అనుకుంటాయి. ! కానీ  అవి అంతదూరం ఎగరలేవు!. కాశీ ఎక్కడో వాటికి  తెలీదు. !. ఒకడు పూలగంపతో , మరొకడు కట్టెలమోపుతో కాశీకి కలిసి వెళ్తుండటం విని ,ఒక ఈగ పూలల్లో, రెండో ఈగ కట్టెమోపులో దాగి నాయట.. ! నిజంగానే అవి రెండూ కాశీ చేరాయి. !కానీ పూలను ,అంటే  "సత్సంఘాన్ని  "ఆశ్రయించిన ఈగ నేరుగా విశ్వేశ్వరుని శివలింగంపై పడి ,పరమనందాన్ని పొందితే ,కట్టెల్లో ఉన్న ఈగ మణికర్ణికా ఘాట్ లో శవ దహనం కోసం వేసే  కట్టెలతో బాటు  ,కాశీ కాశీ అంటూ స్మరిస్తూ మంటల్లో దహించబడింది అయితే . దుష్ట సహవాసం చేసినా ,అంటే కట్టెలను నమ్ముకున్నా  కూడా  ,ఆ జీవుడు  "కాశీ "అన్న పదాన్ని భావిస్తూ  స్మరిస్తూ "కాశీలో"నే , మరణించడం వల్ల  ఆ రెండో ఈగ ,నేరుగా పరమేశ్వరుని తేజంతో  కలిసి మోక్షాన్ని పొందింది. !ఒక  "కాశీ" అన్న పేరులోనే ఇంత వైభవం నిండి ఉంటే , ఇక  "కాశీక్షేత్ర మహత్తు" ఇంకెంత గొప్ప అద్భుతమో. కదా..! గంగానదిలో స్నానం ,విశ్వేశ్వరుని దర్శనం తర్వాత అన్నపూర్ణమ్మ హస్త భోజన ప్రసాదం.. ఇవి జీవిత సాఫల్య ఫలాలు !. సాక్షాత్తు విశ్వేశ్వరుడే అన్నపూర్ణమ్మ తల్లి  ముందు  "జ్ఞాన భిక్షను " ఇమ్మని అర్తించాడట ! అంటే ఆమె ఎంత సర్వజ్ఞురాలో తెలుస్తోంది కదా ! ఎప్పుడు  ,ఎవరికీ  లేదనకుండా, కాదనకుండా నిరంతరం అన్నదానం చేస్తున్న అన్నపూర్ణమ్మ,తల్లి ,, కేవలం ఒక్క "అన్నమే" కాదు ,!భక్తి జ్ఞాన వైరాగ్యాలు కూడా అర్హత ,యోగ్యత ,ఆర్తితో ఉన్నవారికి కారుణ్యంతో ,పరమ సౌజన్యం తో   అనుగ్రహిస్తూ ఉంటుంది..! ఇంట్లో రోజూ మనం  కడుపునిండా  తినే భోజనం ,మనకు ఆనందాన్ని తృప్తినీ ఇస్తుంది కదా. ! ఇదే ప్రత్యక్షంగా  "అమ్మలగన్న అమ్మ "అన్నపూర్ణమ్మ " నే మనకు  ప్రసాదంగా వడ్డిస్తన్న భావన నిజంగా  మన హృదయంలో నిత్యం కలిగితే , "  ఆహా  ! ఎంత మంచి మధురభావన !" ఇది !ఆ  ఆరగింపు మాతకు సమర్పించే " నైవేద్యం " కాక మానదు కదా  ! అంతటి యోగీంద్రుడు వ్యాస మహర్షి కూడా క్షుదా గ్ని బాధకు తాళలేకపోియాడు. ,శివుడు పెట్టిన పరీక్షకు ,ఏడు రోజులు భిక్ష దొరక్కపోవడంతో ,వ్యాసుడు  ,ఆకలితో ,కోపంతో కాశీనగరాన్ని"  విద్య ,ధనం, ఆనందం ఉండకుండా శపించబోతే ,అన్నపూర్ణమ్మ ఆపింది!అతని తప్పిదాన్ని తెలిపింది. , అతనికి, అతని పదివేల మంది శిష్యగణానికి క్షణంలో తృప్తిగా భోజనం పెట్టింది కూడా !.. తండ్రికి కొడుకుపై కోపం వస్తే , కన్నతల్లి ప్రేమతో ,దయతో దగ్గరికి పిలిచి ,తన స్వహస్తాలతో, కమ్మని భోజనం పెట్టి పంపించే  మాత అన్నపూర్ణమ్మ కారుణ్యం అపారం కదా. ప్రేమానురాగాలు చూపిస్తూ ఆమె మహర్షి తో అంది .....!" ముని" అంటే ఇంద్రియాల ప్రభావాల పట్ల మౌనంగా  ఉండాలి కదా  !,మరి పైగా .నీవు సంయమీంద్రునివి ,అనగా జితేంద్రియుడివి ,!ఇలా అపర కైలాస క్షేత్రం ,పరమేశ్వరుని సన్నిదానంలో ,శువ శాసనానికి వ్యతిరేకంగా , శాపం ఇచ్చేంత మూర్ఖంగా ,అజ్ఞానం తో ,అహంకారం తో ఎలా వ్యవహరించావు.? ""అని అమ్మ మంద లిస్తే ,అయ్య. నెమో".,," నీకు ఈ కాశీ క్షేత్రం లో ఉండే యోగ్యత " లేదంటూ ,తన కాశీనగరం నుండి. వెళ్లగొట్టాడు. !పాపం  ! ఆ ముని ,తీవ్ర పశ్చాత్తాపంతో కాశీనగరం పై అపారంగా పెంచుకున్న మమకారంతో ,  ,కాశీనగర పొలిమేరల్లో ఉంటూ ,ప్రతీ పౌర్ణిమ రోజున మణికర్ణికా కుండంలో స్నానం చేస్తూ, విశ్వేశ్వరుని దర్శనం చేస్తూ తిరిగి వెళ్లిపోతు ఉంటాడు.! కాశీనగర విరహాన్ని వ్యాసమహర్షి భరించలేక ,శివాజ్ఞను తిరస్కరించలేక ,కాశీ నగర పొలిమేరల్లో తన శాశ్వత నివాసాన్ని సుస్థిర పరచుకున్నాడు.!..  అలా ఎవరైనా శివనింద చేసినా,  "అన్నం న నింద్యతే..!" అన్న వేదవాక్యం ప్రమాణంగా , అన్నాన్ని నిందించడంకానీ, విసిరి పారేయడం, అన్నాన్ని త్యజించినా. వారికి  జీవనాధారమైన  పట్టెడన్నము కూడా  దొరకకుండా పోతుంది.! కేవలం   తాను పెట్టే అన్నం తో మన పొట్ట నింపడమే కాదు,,, మనిషిలోని అన్నమయ ,మనోమయ ఆనందమయ,,జ్ఞానమయ ,కోశాలకు  పుష్టినీ తుష్టినీ ,,భక్తి జ్ఞాన వైరాగ్యాలను  అనుగ్రహిస్తుంది.!". వైరాగ్యం  "అంటే అంత సులభమైన విషయం కాదు.కదా !" ముక్తసంగుడు" కావాలి.! అంటే సుఖదుఃఖాలు అనుభవిస్తున్నా కూడా ,వాని యందు ప్రభావితుడు కాకుండా ,సాక్షిలా ఉంటూ  ,అంతా పరమేశ్వర ప్రసాదంలా భావిస్తూ  , ,అంతరంగం లో ఈశ్వర తత్వచింతనతో  రమిస్తూ ,,రాగద్వేషాలకు అతీతంగా  ప్రవర్తించేవారిని  విరాగులు అనవచ్చును..! మాతా అన్నపూర్ణ , ప్రతీ రోజూ అపరాహ్నం వేళల్లో ,ఒక చేత్తో స్వర్ణ పాత్రలో  కమ్మని పాయసం ,అంటే పరమాన్నంను , మరో చేతిలో బంగారు గరిట తో  ,కాశీనగరం ఉన్నవారికి నిత్యం ప్రసాదంగా  తన అమృతహస్తాలతో ,అందించడానికి సిద్ధంగా ఉంటుంది.! ఇలా..భక్తిశ్రద్ధలతో తన స్వామిని విశ్వేశ్వరుని దర్శనార్థం వచ్చినవారు.. ఆ !" అంటూ నోరు తెరచి క !" అంటూ లోనుండి శబ్దాన్ని . లి! " అనే  అక్షరంతో  "ఆకలి "పూర్తి చేయక ముందే ,అనకముందే , అన్నపూర్ణమ్మ ప్రసాదాన్ని అందిస్తూ  ,కరుణతో తన బిడ్డల ఆర్తిని  ,ఆకలిని తీరుస్తుందట.  !ఇక  ,ధరణి పై ఎక్కడ నుండి అయినా  కాశీకి రాలేని వారు ,"కాశీ కాశీ  !" అంటూ పలుమారు  తలుస్తూ ,కొలుస్తూ ,స్మరిస్తూ  ,పిలుస్తూ ఉండే భక్తులను  ,కాశీ విశాలాక్షి మాత ,తన విశాలమైన కన్నులతో చూస్తూ, కరుణించి ,విశ్వేశ్వర సందర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుందట.! ..తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు. పుష్కరిణి లో స్నానం ,పిదప అక్కడే కొలువున్న వరాహస్వామిని  ఎలా దర్శించుకోవాలో ,అలాగే, కాశీలో , కూడా  గంగా స్నానం పిదప ,,కాలభైరవుడిని దర్శించి ,దుండి గణపతి ,సాక్షి గణపతుల వద్ద హాజరు వేసుకుంటే గాని  ,విశ్వేశ్వర స్వామి దర్శనాభాగ్య ఫలితం దక్కదు... !   వాస్తవానికి కాశీ క్షేత్రం పుణ్యాలరాశి , !భుక్తిముక్తి ప్రదాయకమే కాదు ,,.ఈ జన్మకే కాదు , ,,జన్మ జన్మలకు సరిపడే శాశ్వత సౌఖ్యాలను అందించే కర్మ సాధన భూమి..!". పునరపి జననం ,పునరపి మరణం,, పునరపి జటరే, జననీ శయనం !!",అని భజగోవిందం  స్తోత్రంలో జగద్గురువు శంకరాచార్యులు గారు చెప్పినట్టుగా ,"చావు పుట్టుకలు "లేకుండా ,ఏ జపతప ,హోమ యాగాది యజ్ఞాలు చేసే అవసరం లేకుండా , కేవలం ,కాశీ క్షేత్ర నివాసయోగం ,శివ ధ్యానం వలన మాత్రమే లభ్యమయ్యే జీవన మకరందమును నేరుగా ఆస్వాదించే అద్భుతమైన అపురూపమైన ,ఆనందనిలయమైన ,మోక్షభూమి ఈ కాశీ క్షేత్ర భూమి..ద్వారా మనం పోందవచ్చును కదా ! అమరత్వాన్ని ,మోక్షమార్గాన్ని ,ఇంత సులువుగా అనుగ్రహించే సౌలభ్యం ,మానవాళికి కేవలం ఈ కాశీక్షేత్రం లో నే లభ్యం ! మనం ఊపిరి పీల్చుకున్నంత సులభంగా ఈశ్వర సాన్నిధ్యం ,పరమేశ్వర సాయుజ్యం మనకు అనుగ్రహింప బడుతున్నాయి..! కానీ ,సంకుచిత మనస్కులై ,దైవచింతనా భావ శూన్యులై , సంసారాపేక్ష వ్యసన పరాయణులై ,,తానెవరో, ఎందుకు భూమిపై కి వచ్చాడో,, ఎవరు తన మనుగడకు మూలమో.,, తెలుసుకోకుండా జ్ఞానమున్నా కూడా పరమాత్మను తన పరమార్ధాన్ని అవగాహన ,చేసుకునే కనీస జ్ఞానం  ,వివేకం లేకుండా ,ఉత్కృష్టమైన దైవాంశ సంభూతమైన మానవజన్మను ,వ్యర్థం గా చేజేతులారా చేసుకుంటున్న  మనిషి దౌర్భాగ్యాన్ని ,దుస్థితిని ,దృక్పథాన్ని తొలగించి ,ఉద్ధరించే నాథుడు ఒక్కడే.  ! వాడు విశ్వనాథుడే ! అందుకే ఇప్పటికైనా ,ఇప్పుడైనా ,అనాధనాథుడు ,. అతడే కాశీవిశ్వనాథుని సన్నిధియే మనకు పెన్నిధి అవుతోంది ! ఎంత బందుబలగం ఉన్నా, అష్టైశ్వర్యాలు ఉన్నా, ఈశ్వరుని దయలేనివారు నిజమైన అనాథలు   ! అందుకే ,ఇన్ని ఇచ్చిన స్వామికి  ,కనీసం కృతజ్ఞత  చెప్పుకోలేక పోతే ,పశువులకు ,మనకు తేడా ఉంటుందా .! మనలో  ఈ గుర్తింపు ,ఈ నమ్మకం ,ఈ గురి రావాలంటే  ,గుండెల్లోంచి పిలుపు రావాలి.!. నీ భార్య,లేక భర్త ,పిల్లలను ప్రేమతో , ఎలా గొంతు చింపుకొని ,ఎలుగెత్తి, ఆవేశంగా ,ఆవేదనతో ,ఎలా పిలుస్తావో  ,అలా పిలువు ,, చాలు !  ఆయన వింటాడు. !నీ సంగతి చూస్తాడు!. ఇక నీకు  "లేదు " అనే మాట లేకుండా చూస్తాడు.! అందుకోసం  మనం ," ఈశ్వరా  ! కాశీవిశ్వనాథా  ! "అంటూ  ఆర్తితో ,పిలుద్దాం ! అతని సాన్నిధ్యంలో ,అతని ఆశ్రయంలో ,అతని పర్యవేక్షణలో ఉన్నట్టు భావించుదాం !.ఈశ్వరున్ని హృదయంలో ప్రతిష్టించుకుందాం !కాలమనే ప్రవాహ వేగంతో బాటు నిస్సహాయంగా దొర్లుకు పోయే బండరాళ్ల వలె  ,చైతన్యం కోల్పోకుండా  ,,తీవ్రమైన తుఫాను దాటికైనా ,తట్టుకొని ఎదురునిలిచే  జీవమున్న గడ్డిపోచ వలె ,ఈశ్వరధ్యానంతో , దానితో మమేకమైన భావంతో , చిత్తశుద్ధితో స్థిరంగా నిలుస్తూ ,, పరిశుద్ధమైన పవిత్రమైన , భావ సంపదతో,పరమాత్మ చింతనతో , పరమానందం గా , ఉందాం.. ! జీవిత పరమార్ధాన్ని సాధిద్దాం !  ""ఓమ్ నమః శివాయ ! హరహర మహాదేవ శంభో !,,కాశీ విశ్వనాథ గంగే ! "అంటూ సదాశివ భజనతో శివానుగ్రహాన్ని పొందుదాం  ! స్వస్తి !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...